
డైనమిక్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ‘ఇష్మార్ట్ శంకర్’ హిట్ తో పూర్వ వైభవాన్ని సొంతం చేసుకున్నారు. ఆ చిత్రం తర్వాత ఆయన రూపొందిస్తున్న చిత్రం ఫైటర్. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా ప్యాన్ ఇండియా వైడ్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉండే ఆయన, స్పాటిఫై ఆప్ లో ‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో రకరకాల విషయాలను ఆడియన్స్ తో పంచుకుంటున్న విషయం తెలిసిందే. పూరీ మ్యూజింగ్స్ కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వస్తోంది. ఆయన చెప్పిన కాఫీ, ఫర్పెక్ట్ హస్బెండ్, ఎండ్, ఫ్లాప్ మూవీస్ లాంటి విషయాలు విశేష స్పందన పొందాయి. అయితే తాజాగా పూరి ‘ప్రిడేటర్ డ్రోన్’ గురించి చెప్పారు. ఈ పాడ్ కాస్ట్ లో పూరి ఏమన్నారంటే.. “ప్రపంచంలోని అత్యంత పవర్ఫుల్ డ్రోన్ ఇది. రైఫిల్స్ ను, మిస్సైల్స్ ను కూడా తన వెంట తీసుకెళ్ళగలదు. పది అడుగుల పొడవుంటుంది. రెక్కలు 55 అడుగుల పొడవుంటాయి. 25 వేల అడుగుల ఎత్తులో ఎగురగల సామర్థ్యం దీనికుంది. గాలిలో 20 నుంచి 30 గంటలు ఉండగలదు. అది ఒక డేగ లాంటిది. అది ఓ నగరం పైన ఉందంటే ఆ సిటీ మొత్తం సర్వైలెన్స్ లో ఉన్నట్టే. ఎక్కడ కావాలనుకుంటే అక్కడకు జూమ్ చేసి సిటీలో ఉండే ప్రతి ఒక్కరినీ క్లోజ్ గా అబ్జర్వ్ చేయొచ్చు. ఎంతో మంది టెర్రరిస్ట్ లను అంతమొందించడంలో ఈ డ్రోన్ ది కీలక పాత్ర. ఈ డ్రోన్ అంటే టెర్రరిస్ట్ లకు చాలా వణుకు”.
“ఓ రోజు పాకిస్థాన్ లోని అబోటాబాద్ లోని ఓ అనుమానాస్పద ఇల్లు ప్రిడేటర్ డ్రోన్ ద్వారా అమెరికా సీ.ఐ.ఏ కంటపడింది. ఆ ఇంటికి కరెంట్ సప్లై, ఫోన్ కనెక్షన్ లేదు. ఆ ఇంటి గేటు ఎప్పుడూ తెరిచేవారు కాదు. రోజూ సాయంత్రం 5 గంటల సమయంలో ఓ వ్యక్తి ఇంటి కాంపౌండ్ లో వాకింగ్ చేసేవాడు. ఆ వాకింగ్ చేస్తున్న వ్యక్తి నీడ ఆధారంగా అతడి హైట్ 6.3 అడుగులు అని తెలుసుకున్నారు. ఆ హైట్ ఆధారంగా ఆ నడిచే వ్యక్తి ఒసామా బిన్ లాడెన్ అని తేలింది. ఈ డ్రోన్ సాయంతో ఆ ఇంటిని లేజర్ స్కాన్ చేశారు. అచ్చం అలాంటి ఇంటినే అమెరికాలో కట్టారు. అలాంటి ఇంట్లో ఓ టెర్రరిస్ట్ ఉంటే ఎలా ఎటాక్ చేయాలో సీల్ టీమ్ కు శిక్షణ ఇచ్చారు. ఆరు నెలల తర్వాత ఓ రాత్రి ఎటాక్ ప్లాన్ చేశారు. ఆ ఆపరేషన్ కు జోరానిమో అని పేరు పెట్టారు. ఒబామా టీమ్ అమెరికాలోని వైట్ హౌస్ లో కూర్చుని ఈ డ్రోన్ సీల్స్ బాడీ కెమెరాల ద్వారా అపరేషన్ ను మానిటర్ చేస్తూ లాడెన్ ను తుదిముట్టించారు” అని పూరీ పేర్కొన్నారు.