
కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రిత్వ శాఖ 2019కి గానూ వివిధ భాషలకు చెందిన పలు సినిమాలకు లభించిన అవార్డులను ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా దీనికి సంబందించిన గెజిట్ రిలీజ్ చేసింది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ద్వారా సినిమాల ఎంపిక చేపట్టగా... ఇందులో 2019 జనవరిలో విడుదలైన 'ఎఫ్ 2' (ఫన్ అండ్ ఫస్ట్రేషన్ ) చిత్రానికి కేంద్ర ప్రభుత్వ అవార్డు లభించింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా, మెహ్రీన్ ఫిర్జ్యాదీలు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఇండియన్ బెస్ట్ ఫీచర్ ఫిలిం కేటగిరీలో టాలీవుడ్ నుంచి ‘ఎఫ్-2’కు ఈ అవార్డు దక్కినట్లు తెలుస్తోంది. ఫీచర్ ఫిల్మ్స్ కేటగిరీలో తమిళ్ నుంచి ‘హౌస్ ఓనర్’, హిందీ నుంచి ‘ఉరి’, ‘గల్లీ బాయ్’ ‘సూపర్ 30’ ‘బదాయి హో’ మలయాళం నుంచి ‘జల్లికట్టు’ సినిమాలు అవార్డులు గెలుచుకున్నాయి. 2019 సంక్రాంతికి విడుదలైన 'ఎఫ్ 2' చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. దాదాపుగా 100 కోట్ల వరకు వసూలు చేసింది. 2019 సంవత్సరం సంక్రాతి అల్లుళ్ళుగా వెంకటేష్, వరుణ్ తేజ్ లు నవ్వులు పూయించారు. మంచి రివ్యూస్ ని సొంతం చేసుకుని కమర్షయల్ గా కూడా సూపర్ హిట్టయ్యింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ 'ఎఫ్ 2' చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, సుబ్బరాజు, ప్రగతి, నాజర్, అన్నపూర్ణమ్మ, వై.విజయ, అనసూయ తదితరులు నటించారు.