
‘మన్మథ’ ‘వల్లభ’ ‘నవాబ్’ వంటి చిత్రాలతో కోలీవుడ్ స్టార్ హీరో శింబు తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమే. ప్రస్తుతం శింబు నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ సుశీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్రామీణ నేపథ్య చిత్రంలో నటిస్తున్నారు. మహాదేవ్ మీడియా బాలాజీ సమర్పణలో డీ కంపెనీ - కేవీ దురై బ్యానర్ లో ఈ చిత్రం నిర్మితమవుతోంది. తాజాగా ఈ చిత్రానికి ''ఈశ్వరన్'' అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు చిత్ర బృందం వెల్లడించారు. ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ ని ఈ సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ చిత్రం తెలుగులోకి ‘ఈశ్వరుడు’ గా డబ్బింగ్ అవ్వబోతోంది. ‘ఈశ్వరుడు’ ఫస్ట్ లుక్ పోస్టర్ లో శింబు లుంగీ కట్టుకొని పడగవిప్పిన పాముని మెడ మీద వేసుకొని కనిపిస్తున్నారు. అంతేకాకుండా మోషన్ పోస్టర్ లో మెడపై క్రికెట్ బ్యాట్ పట్టుకుని ఉన్న ఇంకో లుక్ ని విడుదల చేశారు. శింబు లుక్ చూస్తుంటే గతంలో కంటే చాలా కొత్తగా కనిపిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో శింబు సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. తమిళంలో ఇప్పటికే ‘భూమి’ అనే సినిమాలో నటించిన నిధికి ఇది రెండో ప్రాజెక్ట్. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2021 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అలాగే ఈ సినిమా తర్వాత శింబు క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘మానాడు’ అనే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటిస్తున్నారు.